జపాన్ నౌకలో కరోనా కల్లోలం... తమను తీసుకెళ్లాలంటూ భారతీయుల ఆవేదన

  • హాంకాంగ్ లో దిగిన ప్రయాణికుడికి కరోనా ఆనవాళ్లు
  • యోకహామా రేవులో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ నౌక
  • నౌకలో 3700 మందికి పైగా ప్రయాణికులు
  • 130 మందికి పైగా ప్రయాణికులకు వైరస్ సోకినట్టు గుర్తింపు
చైనాలో మొదలైన కరోనా వైరస్ బీభత్సం ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. ఇటీవల డైమండ్ ప్రిన్సెస్ అనే జపాన్ నౌకలో ప్రయాణించి హాంకాంగ్ లో దిగిన యాత్రికుడికి కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో ఆ జపాన్ నౌకను యోకహామా రేవు వద్ద నిలిపివేశారు. గత కొన్నిరోజులుగా డైమండ్ ప్రిన్సెస్ నౌక ఆ రేవులోనే నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ నౌకలో 3700 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, వారిలో 130 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించారు. ఇదే నౌకలో సుమారు 160 మంది భారతీయులు కూడా ఉన్నారు.

ఈ నౌకలో తమ పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటివరకు కరోనా పరీక్షలు కూడా చేయలేదని చెఫ్ గా పనిచేస్తున్న వినయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న ఇతర భారతీయులతో కలిసి వినయ్ కుమార్ ఓ వీడియో సందేశం వెలువరించారు. తమను తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. నౌకలో ఉన్న భారతీయులను వేరు చేసి, వీలైనంత త్వరగా తరలించాలని కోరారు.
Go Back to Shorts
Corona Virus
Japan
Yokahama
Diamond Princess
Indians
Narendra Modi
UNO

More Telugu News